Feeds:
టపాలు
వ్యాఖ్యలు

http://sakshi.com/main/WeeklyDetails.aspx?Newsid=40556&Categoryid=1&subcatid=3

AzarNafisi(Sakshi)అజర్ నఫిసీ – ఇరాన్ కు చెందిన అంతర్జాతీయ రచయిత్రి. ఆమె రాసిన Reading Lolita in Tehran అంతర్జాతీయ బెస్ట్ సెల్లర్ గా గుర్తింపు పొందింది. ఆమె కలం నుంచి తాజాగా వెలువడ్డ Things I Have Been Silent About ఇరాన్ లో పుట్టి పెరిగిన ఆమె వ్యక్తిగత జీవితానికి సంబంధించిన జ్ఞాపకాల దొంతర. ఇది కేవలం నఫిసీ వ్యక్తిగత జీవితం మాత్రమో, ఇరాన్ దేశపు రాజకీయ విప్లవ చరిత్ర మాత్రమో కాదు. ఇరాన్ దేశపు రాజకీయ విప్లవ చరిత్ర, నఫిసీ కుటుంబ చరిత్ర, ఆమె తల్లితండ్రుల వ్యక్తిగత సంఘర్షణల నేపథ్యాలు అన్నీ కలగలసిపోయిన మెమొరీస్. మనం సమాజంలోని వ్యక్తులుగా, కుటుంబంలోనూ, రాజకీయ జీవనంలోనూ, సాహిత్యంలోనూ ఎలాంటి విషయాల్ని బైటకు వెల్లడి చేయకుండా నిశ్శబ్దంగా లోపల్లోపలే దాచుకుంటామో బహిరంగంగా ప్రకటించింది నఫిసీ ఈ పుస్తకం ద్వారా.కుటుంబంలోని రహస్యాల పట్ల ఓ కూతురి మౌన వేదన, ఓ నవయవ్వనవతిగా సాహిత్యం లోని సెన్సువాలిటి పవర్ ని కనుగొన్న వైనం, ఓ దేశపు స్వాతంత్ర్యం కోసం ఓ కుటుంబం చెల్లించిన మూల్యం ఇవన్నీ మనకు ఈ పుస్తకం చదవటం ద్వారా అర్ధమవుతాయి.
” చాలా మంది మగవాళ్ళు పరాయి స్త్రీల ప్రాపకం కోసం తమ భార్యల్ని మోసం చేస్తారు. కానీ మా నాన్న సంతోషకరమైన కుటుంబ జీవనం కోసం మా అమ్మ ని మోసం చేశాడు” అంటూ ఈ పుస్తకాన్ని మొదలు పెడుతుంది నఫిసీ. “ఆయన కోసం నేను బాధ పడ్డాను. ఒక రకం గా ఆయన జీవితంలోని ఖాళీల్ని నింపటం అనే బాధ్యతను నాకు నేనే తీసుకున్నాను. నేను ఆయన కవితలు సేకరించాను. ఆయన వాగ్దానాల్ని విన్నాను. మొదట మా అమ్మ కోసం, తర్వాత ఆయన ప్రేమలో పడ్డ స్త్రీల కోసం సరైన బహుమతుల ఎంపికలో ఆయనకు సహకరించాను.” అంటూ చెప్పుకొస్తుంది నఫిసీ ఈ పుస్తక ప్రారంభంలో.

అద్భుతమైన కధకురాలు చెప్పిన అందమైన జ్ఞాపకాలు ఈ పుస్తకం. అవి మనసుని మెలిపెట్టి బాధపెట్టే జ్ఞాపకాలు. నఫిసీ ఈ పుస్తకంలో ప్రపంచాన్ని మనం ఎలా చూస్తామో చెప్పటమే కాకుండా మనం ఎందుకు వివిధ దేశాల చరిత్ర చదవటం అవసరమో వివరిస్తుంది. ఏ దేశ చరిత్ర తెలియాలన్నా ముందు ఆ దేశ సాహిత్యం చదవటం ముఖ్యమంటుంది అజర్ నఫిసీ. నఫిసీ తల్లి మేధావే కాదు, చాలా కాంప్లికేటెడ్ కూడా. ఆమె తన కలల్లో తనకంటూ ఓ సృజనాత్మక సాహిత్య లోకాన్ని సృష్టించుకొని అందులో బతికింది. ఆమె చెప్పిన కథలు, ఆమె కథనం ఇవన్నీ నఫిసీ కి క్రమంగా అర్ధమవటం వల్ల ఆ కథనాల్లో దాగి వున్న తన తల్లికి సంబంధించిన అసలు విషయాన్ని అవగతం చేసుకోగలిగింది.
నఫిసీ తండ్రి మరో రకమైన ‘ నేరేటివ్స్ ‘ వైపు మళ్ళాడు. ఇరాన్ దేశ చరిత్ర, సంస్కృతికి సంబంధించిన సంప్రదాయ కథలు ‘ షానామే’,( Shahnameh- పర్షియన్ రాజుల గురించిన పుస్తకం) వైపు మొగ్గు చూపి తన పిల్లలను పసితనం నుండి ఆ కథల ద్వారా మంత్రముగ్ధుల్ని చేసేవాడు. నఫిసీ తండ్రి ఇతర స్త్రీలతో పరిచయాలు పెంచుకొని, వారితో సంబంధాలు పెట్టుకోవడం గమనించినా, పసితనం నుంచి నఫిసీ ఈ రహస్యాలన్నింటినీ తల్లి దగ్గర నుంచి దాచిపెట్టింది. ఈ ప్రభావం వల్ల నఫిసీ తర్వాతర్వాత రాజకీయ, సాంస్కృతిక , సామాజిక, వ్యక్తిగత విషయాల్లో కూడా అన్యాయాల్ని ఎలా మౌనంగా ఎదిరించకుండా వుండిపోయిందో పాఠకులకు అర్ధమవుతుంది.
ఈ పుస్తకం బలమైన చారిత్రక అక్షర చిత్రం– ఒక కుటుంబంలోని మార్పు, ఒక దేశంలోని రాజకీయ వ్యవస్థ మార్పు –రెండూ ఎలా కలగలిసి వుంటాయో ఈ ‘ మెమోయర్ ‘ ద్వారా మనం అర్ధం చేసుకోవచ్చు. నఫిసీకి ఇష్టమైన ఇరాన్, మనందరం కూడా ప్రేమించే ఇరాన్ క్రమేపీ ఒక మతపరమైన నిరంకుశ, నియంతృత్వ పాలనలోకి ఎలా మళ్ళిందో మనకు తేటతెల్లంగా అర్ధమవుతుంది. ఇరాన్ లో స్త్రీలకున్న ఛాయిస్ లపై చాలా లోతైన, వ్యక్తిగత విశ్లేషణ చేసింది నఫిసీ ఈ పుస్తకం ద్వారా. వీటి ద్వారా నఫిసీ భిన్నమైన జీవితాన్ని ఎన్నుకోవటానికి ఎలా వుత్తేజపరిచిందో చెపుతుంది. ఓ స్త్రీ ఎప్పటికీ మర్చిపోలేని జ్ఞాపకాలు ఇవి. వ్యక్తిగత, కుటుంబ, కల్లోలిత మాతృభూమి జ్ఞాపకాలివి.
కథలు చెప్పటం ఆ కుటుంబంలో అందరికీ వెన్నతో పెట్టిన విద్య. నఫిసీ తల్లి తన అసంతృప్తులను తప్పించుకోవటానికి తన వూహా ప్రపంచాన్ని వాస్తవిక ప్రపంచంగా పిల్లలకు కథలుగా చెప్పేది. నఫిసీ తండ్రి ఇరాన్ దేశ రాజుల చరిత్రను, పర్షియను సాహిత్యాన్ని పిల్లలకు ప్రతి రాత్రి నిద్రపోయేటప్పుడు కథలుగా చెప్పెవాడు.నఫిసీ తల్లి కథలు రాయదు కానీ, తన గత జీవితాన్ని కథలుగా మలిచి పిల్లలకు చెప్పేది. ప్రతి కథ చివర్లో ఆమె ఇలా ముగించేది ” అయితే నేనొక్క మాట కూడా అనలేదు. నిశ్శబ్దంగా వుండిపోయాను” అని. నఫిసీ తల్లి నిజంగానే బలంగా నమ్మేది ” తనెప్పుడు తన వ్యక్తిగత జీవితాన్ని గురించి చెప్పలేదని”. అయితే తనదైన శైలిలో ఆమె ఎప్పుడూ తన వ్యక్తిగత జీవితంలోని గత స్మృతుల గురించే పిల్లలతో మాట్లాడేది. వ్యక్తిగత విషయాలు బైటకు వెల్లడి చేయకపోవటమనేది ఇరానీ సంస్కృతిలో ఒక ముఖ్యమైన అంశం. నఫిసీ తల్లి ఎప్పుడూ అంటుండేదట ..” మన మురికి దుస్తుల్ని మనం బైట ఆరెయ్యం” అని. పైగా వ్యక్తిగత జీవితాలనేవి అల్పమైన విషయాలతో కూడుకొని వుంటాయి. వాటి గురించి రాసుకునేంత ఏముంటాయి? అందరికీ ఉపయోగపడే జీవిత చరిత్రలు ముఖ్యమైనవని నఫిసీ తల్లి అభిప్రాయం. అయితే నఫిసీ కి తెలుసు ఇక ఎప్పటికీ తాను నిశ్శబ్దంగా వుండకూడదని…అందుకే తన గురించి, తన తల్లితండ్రుల గురించి, తన కుటుంబాన్ని గురించి, తన దేశాన్ని గురించి, ఇరాన్ రాజకీయ వ్యవస్థ గురించి అన్నింటి గురించి బాహాటంగా ఈ పుస్తకం లో మాట్లాడేసింది.
అందుకే నఫిసీ అంటుంది ” మనం నిశ్శబ్దంగా వుంటున్నామనుకుంటాం కానీ నిజంగా వుండం. ఎలాగంటే ఏదొ ఒక రకంగా మనకేం జరిగిందో అన్న దాని బట్టి మనమెలా మారామో, మనమెలా రూపుదిద్దుకున్నామో అన్నది మనం ఏదో ఒక రకంగా వ్యక్తీకరిస్తూనే వుంటాము” అని.
నఫిసీ తండ్రి పర్షియన్ సాహిత్యంలోని సంప్రదాయ కావ్యాల ద్వారా ఆ దేశ చరిత్రను తన పిల్లలకు కథల రూపంలో అందించాడు. ఆ సాహిత్యం ద్వారానే వాళ్ళకు ఇరాన్ దేశ చరిత్ర గురించి అర్ధమైంది. అందుకే నఫిసీ అంటుంది పిరదౌసినీ మర్చిపోవడమంటే ఇరాన్ ని నిర్లక్ష్యం చేయడం అని. ఇటీవల ఆస్టిన్ లో యూనివర్శిటి ఆఫ్ టెక్సాస్ వారు అజర్ నఫిసీ తో నిర్వహించిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో ఆమె ఇదే మాట చెప్పింది. మన దేశ సాహిత్యకారుల్ని గుర్తుంచుకోవడం, వారి రచనల్ని మననం చేసుకోవడమంటే మాతృ దేశం పట్ల మనకున్న భక్తిప్రపత్తులను పరిపుష్టం చేసుకోవడమే అంటుంది నఫిసీ తన ప్రసంగంలో, తన పుస్తకంలో, తన మాటల్లో…
ఈ పుస్తకాన్ని ఒక రాజకీయ లేదా సాంఘిక కామెంటరీ లాగానో, లేదా ఉపయోగపడే జీవిత చరిత్ర లాగానో వుండాలని నఫిసీ కోరుకోలేదు. ఆమె ఒక కుటుంబ కథ చెప్పాలనుకున్నది. ఆ కథ ద్వారా ఇరాన్ రాజకీయ, సాంస్కృతిక చరిత్ర తెలియ చెప్పాలన్నది ఆమె వుద్దేశ్యం. అది ఖచ్చితం గా నూటికి నూరుపాళ్ళు నెరవేరింది. ఇరాన్ వున్నంత కాలం చరిత్ర, సాహిత్యం రెండూ అజర్ నఫిసీ ని మర్చిపోవు. మర్చిపోలేవు.

కల్పనారెంటాల

kavichalamకవి చలం…వజీర్ రెహ్మాన్ అద్దంలో…!

మీకు బాగా నచ్చిన కవి ఎవరూ? అంటే కవిత్వ అభిమానులు, ప్రేమికులు ఎవరైనా ఠక్కున కనీసం ఓ పదిపేర్లు చెప్పగలరు . ఆ పదిపేర్లు ఫలానా వారివే అయివుండనక్కరలేదు. ఎందుకంటే అది వారి వారి అభిరుచిని బట్టి వుంటుంది కాబట్టి. నేను చెప్పే పది పేర్లలో తప్పనిసరిగా వుండే రెండు పేర్లు –ఒకటి చలం, రెండోది వజీర్ రహ్మాన్. చలం కవా? అని ఇప్పటికీ కొందరు అశ్చర్యపోతుంటారని నాకు తెలుసు. ఆ మాటకొస్తే మీరు కవి అని వజీర్ రహ్మాన్ చెప్పేటప్పటికి చలమే బోలెడంత ఆశ్చర్యపోయారు.

చలం వచనం కవితాత్మకం అని వేరే చెప్పక్కరలేదు. మొదటి సారి చదివిన కొత్త పాఠకుడు కూడా వెంటనే చలం కవితాత్మకతని గుర్తు పడతాడు. అసాధారణమయిన మ్యూజింగ్స్ మొదలుకొని సాధారణమయిన గల్పికలూ, వ్యాసాల్లో కూడా చలం కవి అనుకోడానికి తగినన్ని దాఖలాలు దొరుకుతాయి. అవి కాక, శ్రీ శ్రీ, పఠాభి లాంటి కవుల గురించి చలం రాసిన వాక్యాల్లో కవిత్వం తొణికిసలాడుతుంది. కవుల మీద గొప్ప ప్రేమా, తీవ్రమయిన కోపం – రెండూ కనిపిస్తాయి.ఎంతో మంది కవులే అనువాదం చేసినప్పటికీ, టాగూర్ గీతాంజలి చలం అనువాదంలోనే చదవాలని అనిపిస్తుంది. అదీ చలం వచనం ప్రత్యేకత.

చలం ది కవిత్వం లో కూడా భిన్నమైన దారే. సామన్యంగా ఆధునిక తెలుగు కవులు అనేకమంది కవిత్వాన్ని వచనంలో రాస్తారు. కానీ వచనంలో కవిత్వం రాయడం చలం ప్రత్యేకత. ఆ ప్రత్యేకతను గుర్తు పట్టి ప్రత్యేకంగా కవిగా చలాన్ని పరిచయం చేసిన హృదయమున్న వ్యక్తి వజీర్ రహ్మాన్.

చలం శతజయంతి సందర్భం గా 1994 లో శతజయంతి సంఘం వారు వేసిన ఈ పుస్తకం అపురూపమైంది. ఎందుకంటే చలం కవిత్వంతో పాటు చలం వి వివిధ దశల్లో తీసిన అపురూప ఛాయాచిత్రాలున్న పుస్తకం ఇది. అంటే కవితలతో ఫోటో ఆల్బం అన్న మాట.

చలం కవిత్వ నిషాకి మచ్చుకి కొన్ని పంక్తులు…

‘వానరాత్రి ‘ లో ఏమంటారో చూడండి…

ప్రపంచాన్ని తుడిచేద్దామన్నట్లు వీస్తోంది గాలి/నల్లని రాత్రి ఇంకా నల్లని
మబ్బు వస్త్రాలు కప్పుకుని ఏడుస్తోంది/
హోరుమని అరుస్తో వాన/తలుపులు మూసి దీపం వెలిగించుకున్న/వాన లోపలికి వస్తానని పంతం పట్టి
తలుపు మీద ఈడ్చి కొడుతోంది–/తెరవమని/కొంచం మర్చిపోతుంది,
మళ్ళీ నేను గ్యాపకం వొస్తాను గావును/దబదబా బాదుతుంది;
నా విరహ బాధని ఈ రాత్రిలో కలిపెయ్యలేను?

చదువుకుని ఆ అనుభూతిని స్వానుభవిచటం తప్ప వివరణలు, వ్యుత్పత్తి అర్ధాలు అక్కర్లేని, సూటిగా మాట్లాడే కవిత్వం చలానిది.
ప్రేయసి అన్వేషణ గురించి ఏ రాసుకున్నారో చూడండి…

నీవు రావు/నన్ను పోనీవు!
మరల్చి మత్తెక్కించి/స్వప్నాలతో లాలించి/మధురగానాలతో వూగించి/ప్రపంచానికి వ్యర్ధుణ్ణి చేసావు!/
అనాదిగా విన్న నీ పిలుపు/స్వప్నంలో అనుభవించిన /నీ కుంతల కొనల స్పర్స/
ఏ యుగాల ఆవలి తీరానో/ సం యోగమనే వాగ్దానం /
ఇంతే నాకు/మిగిలిన ఆశలు!/ప్రియా!/
యోగులు హృదయంతో / వెలిగించుకునే కాంతి- నీ చిరునవ్వు;/
నాకెట్లా దొరుకుతుంది?

మల్లెపూల గురించి చలం తమకం చదవండి…

అర్ధరాత్రులు విచ్చి/ జుట్టు పరిమళంతో కలిసి/ నిద్ర లేపి/ రక్తాన్ని చిందులు తొక్కించే మల్లెపూలు/
సన్నని వెన్నెట్లో/ ప్రియురాలి నుదుటి కన్నా తెల్లగా/ ఏమి చెయ్యలో తెలీని ఆనందంతో/గుండె పట్టి చీలికలు చేశే మల్లెపూలు/
తెల్లరకట్ట లేచి చూసినా/ఇంకా కొత్త పరిమళాలతో /రాత్రి జ్ఞాపకాలతో/ప్రశ్నించే మల్లెపూలు/
అలిసి నిద్రించే రసికత్వానికి/జీవనమిచ్చే ఉదయపు పూలు/ రాత్రి సుందర స్వప్నానికి సాక్షులుగా/అవి మాత్రమే మిగిలిన నా ఆప్తులు! మల్లెపూలు!!

చలం ‘ విరహం’ అనుభూతించండి…

ప్రియుడి రత్యాలింగనం తర్వాత/సంతుష్టి చెందిన ముఖం వలె/గాలిలోని కొత్తని చల్లదనం/
శరీరం మీద తగిలి/హృదయంలోకి దూసుకుపోతోంది/
నిద్ర కమ్మిన కన్ను వలె/వొక్క నక్షత్రం మెరుస్తోంది/
ఈ గోలలొ గాలిలో, పాపం/ఏదో పిట్ట లేచి అరుస్తోంది/చప్పున గాలి ఆగింది/
నది కూడా నిశ్శబ్దమైంది చచ్చిపోయినట్లు/చీకటి నిశ్శబ్దం/నువ్వే లేవు!

చలం కవిత్వాన్ని గురించి మనం ఆస్వాదించి ఆనందించటం సరే. ఆయనే ఏం చెప్పుకున్నారో చూడండి ‘ చలం రాయని “పీఠిక” లో…

వజీర్ రహ్మాన్ గారికి,

మీరు పంపిన గీతలు, ఆ selections అన్నీ కూడా చాలా బావున్నాయి. కొన్ని ఎక్కడివో నేను గుర్తించలేకపోయినాను.
మొదట అవేవో మీరు రాశారనుకున్నాను. ఎవరీ గొప్ప కవి? అని ఆశ్చర్యపడ్డాను. కొంచం దూరం చదివితే గాని, అవి నేను రాసినవని తెలీలేదు. చదువుతున్న కొద్దీ ఇంత గొప్ప కవిత్వం నేనేనా రాశింది అని ఆశ్చర్యపడ్డాను.

ఆ గీతాలు ఎవరివైనా కానీ, అట్లాంటివి ఏ సహృదయుడైనా ఆరాధించవలసిన విలువ గలవి. కాని ఇన్నేళ్ళూ ఎవడు చూశాడు? వాటి రచయతే గుర్తించలేదు వాటి విలువని- ఇన్నేళ్ళకు మీరు జన్మించి, గుర్తించి, సేకరించి, ఎత్తిచూపిందాకా!

తనలో కవిత్వమున్నదని తెలుగువాడు చలానికే తెలీదు.

మల్లెపూల పైన నేను రాసిన Musings కవిత్వంతోనూ, తత్త్వంతోనూ కూడినవని నాకు తెలుసు. ఎవరైన ఇంకొకరు గుర్తిస్తారెమోనని ఆశించేవాణ్ణి. Musings లో మెచ్చుకునేవాళ్ళలో ఒక్కరూ వాటిని ప్రత్యేకంగా మాట్లాడలేదు.ఒక్క రుక్మిణీనాధ శాస్త్రి గారు ఒకసారి passing గా ” చాలా కవిత్వముందండీ; ” అన్నారు, మరి నా హృదయం మీ ఒక్కరికే తెలీడం ఎట్లా జరిగింది?

-చలం

చలం కవిత్వం గురించి వజీర్ రెహ్మాన్ ఇలా అన్నారు:

‘చలాన్ని త్రావి
నిషాలో వున్నాన్నేను-
ముట్టకు
మెరుపై జ్వలిస్తాను!
తట్టకు
ఉరుమై ధ్వనిస్తాను ‘
-వజీర్ రహ్మాన్

ఔను చలం ! ఔను సుమా,
ఔను నిజం నీవన్నది;
నీవన్నది, నీవన్నది,
నీవన్నది నిజం, చలం !
(శ్రీశ్రీ కృతి, శృతి లో)

అగాధం లోంచి బైలుదేరే
నల్లని అలలు మొహాన కొట్టి,
ఉక్కిరి బిక్కిరై,
తుఫాను హోరు చెవుల్లో గింగురుమని,
నమ్మిన కాళ్ళ కింద భూమి దొలుచుకుపోతో వుంటే
ఆ చెలమే నయమని
పరిగెత్తి వస్తా ‘రన్నాడు
చెలం.

‘ అవును,
చెలం వచనాన్ని గీతాలుగా కత్తిరించి
వొడ్డించుకుంటారు కూడా ‘
అన్నాడు వజీర్ రహ్మాన్, వెనక.

విన్న మిత్రులు కాచుక్కూచున్నారు.
ప్రధ్వానం వినబడకపోగా చివరికి రహ్మానే తెగించి
తెలుగు వాంగ్మయాన్ని చెలం గీతాలతో వూగించే
బాధ్యత స్వీకరించాడు.
ఫలితం గా ఈ సమర్పణ.
కవితా ధ్వజాన్ని చేదాల్చి
పాతగోరీల కేసి మొహాలు తిప్పుకుని కూచున్న
వాంగ్మయ పీఠాధిపతుల
నడ్డి విరగ్గొట్టాల్సిన చెలం,
ఎంచాతనో విరమించుకుని;
కృష్ణశాస్త్రిని క్షమించి,
శ్రీశ్రీ ని ఆశీర్వదించి,
వెనక్కి మరలి వచనంలోకి వెళ్ళిపోయాడు.
అంచాతనే కృష్ణశాస్త్రి, శ్రీశ్రీ బ్రతికి వున్నారు,
నేటికీ మనలో
చెలం
తెలుగులో ‘ కవిత్వం ‘ పేరుతో
ఏమీ వ్రాయ
నిరాకరించడం,
వీరిద్దరనీ రక్షించే ఆలోచనో,
లేక తన వచనానికే గోలెత్తిన తెలుగు దేశం
కవిత్వానికి తట్టుకోలేదనో–
తెలీదు.
చెలానికి సంబంధించిన చాలవిషయాలకి మల్లే
ఇదీ ఇంకా అజ్ఞాతంగానే వుండిపోయింది.
ఐనా,
కవిత్వమనే పేరుతో గాకపోయినా, రాసిన వచనమే
చాలు,
చెలాన్ని ‘ మహాకవి ‘ గా
పరిగణించేందుకు.
(కాని,
చెలం గారూ,
ఠాకూర్ అన్నట్లు–
you live alone and unrecompensed
because
they are afraid of
your great worth!)
—వజీర్ రహ్మాన్

చలం కవిత్వమంతా ఆయన అంతరంగ చిత్రాలు –వాటికి బాహ్య రూపాన్ని చిత్రించే ఛాయాచిత్రాలు –రెంటి ఆత్మల్ని అందిపట్టుకొని మనకందించిన సహృదయుడు వజీర్ రహ్మాన్. వజీర్ రహ్మాన్ కవిత్వం గురించి మారో సారి మాట్లాడుకుందాం…

పాత టపాలు »